సూర్యాపేట : సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ కృషితో ఏర్పాటు చేసిన నూతన పారిశ్రామిక విధానం వల్ల పారిశ్రామిక వేత్తలకు సులభంగా అనుమతులు లభిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు . సూర్యాపేట పట్టణంలోని రాయని గూడెం వద్ద చల్లా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ చార్జింగ్ హబ్ (Electric Charging Hub)ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ వాహనాలు కనుమరుగై పోతాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీ(Green Energy) కి ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు . ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలలో భాగంగా మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు.
ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు హైదరాబాదు(Hyderabad)లో తమ సంస్ధలను నెలకొల్పుతున్నాయని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు. సూర్యాపేటలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, బైరు వెంకన్న, జ్యోతి కరుణాకర్, ఉప్పల ఆనంద్, తోట శ్యామ్ ప్రసాద్, చల్లా లక్ష్మి కాంత్, చల్లా లక్ష్మి ప్రసాద్, బండారు రాజా, వోల్ట్రాన్ కంపెనీ ప్రతినిధులు రవిశంకర్, రాజా, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.