హైదరాబాద్ : స్వతంత్ర స్ఫూర్తిని నేటి యువత అలవర్చుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రీడాపోటీల ముగింపు వేడుకలను మేకల అభినవ స్టేడియంలో నిర్వహించగా.. మంత్రి హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. అహింసాయుత మార్గంలో మహాత్మాగాంధీ స్వాతంత్య్రం సాధించారన్నారు. అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.
స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను మూడో తరానికి తెలియజెప్పాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారన్నారు.780 సంస్థానాలుగా ఉన్న భారతదేశంలో ఐకమత్యం లేక, వర్ణ వ్యవస్థతో విడి పోవడంతో అతి చిన్న దేశాలు సైతం భారతదేశంపై దండయాత్ర సాగించాయన్నారు. దక్షిణాఫ్రికాలో బారిస్టార్ విద్యను పూర్తి చేసుకున్న మహాత్మాగాంధీ దేశానికి చేరుకుని.. దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టారన్నారు. ఆ స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్న నేటి తరానికి స్వాతంత్ర్య సంగ్రామ అనుభవాలు తెలియవన్నారు. స్వేచ్ఛ లేనప్పుడే స్వాతంత్య్రం గురించి తెలుస్తోందన్నారు. అలాంటి చరిత్రను తెలియజెప్పడం కోసమే వజ్రోత్సవ వేడుకల సారాంశమన్నారు. ఆ స్ఫూర్తిని నేటి తరం అలవర్చుకోవాలని సూచించారు.