మునుగోడు, ఆగస్టు 27 : వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడమే గుజరాత్ మాడల్ అభివృద్ధా? అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు టీఆర్ఎస్దేనని, బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని పలు సర్వేల్లో వెల్లడైందన్నారు. ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరగ్గొట్టుడే అభివృద్ధా? అని నిలదీశారు. నల్లగొండ జిల్లా మునుగోడులో టీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడా రు.
తామే అంతా నడిపిస్తున్నట్టు భ్రమలు కల్పించడంలో కోమటిరెడ్డి సోదరులది అందెవేసిన చెయ్యి అని విమర్శించారు. మునుగోడులో ఇటీవల నిర్వహించిన అమిత్షా సభకు జనాలను పంపింది భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డే అని ఆరోపించా రు. యావత్ దేశం అభివృద్ధికి నమూనా తెలంగాణ అని కేసీఆర్ పాలనను కొనియాడుతుంటే.. స్వప్రయోజనాల కోసం బీజేపీలో చేరిన రాజగోపాల్రెడ్డి.. అభివృద్ధి కోసం చేరాననడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.
గుజరాత్ బాస్లకు గులాంగిరి చేసేందుకే ఆ యన బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతుబాంధవుడిలా మారారని, ప్రధాని మోదీ మాత్రం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారని విమర్శించారు. సమావేశంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, మార్కెట్ వైస్ చైర్మన్ జాజుల అంజయ్య పాల్గొన్నారు.