Minister Jagadeesh Reddy : ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన సూర్యాపేట నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 7 న సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ కెనాల్(SRSP Canal) పొడవునా కేసీఆర్కు కృతజ్ఞతలతో నిర్వహించనున్న కాళేశ్వర జలానికి లక్ష జన హారతి కార్యక్రమంలో లక్షలాదిగా రైతుకు తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఊరు నుంచి రైతులు తరలి వచ్చి, గోదావరి జలాలకు పుష్పార్చన, వంటా, వార్పులో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం ఇస్తాలపురం గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం 40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పాఠశాల ప్రహరీ నిర్మాణాల వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సూర్యాపేట పట్టణం ఒకటో వార్డ్ పరిధిలోని బురకపిట్ట తండాలో బొడ్రాయి పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ఆలయాలు, బొడ్రాయి పండుగ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారని అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల ఎక్కడా చూసినా, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం జలాల తో సూర్యాపేట జిల్లాలో ఇంచు భూమి లేకుండా ససశ్యామలం అయిందని, సబ్బండ వర్గాలకు జీవనోపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. భూముల ధరలకు రెక్కలు వచ్చి రైతులు కోటీటశ్వరులు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మెన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గుర్రం సత్యనారాయణ రెడ్డి, బత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.