సింగరేణి జోలికి వస్తే ఊరుకోం
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఫైర్
ఎంతటి పోరాటానికైనా సిద్ధం: ప్రభుత్వ విప్ బాల్క సుమన్
సింగరేణి నాలుగు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ రణదీక్ష
మంచిర్యాల, ఫిబ్రవరి 9 : తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసును వెల్లగక్కుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరించాలనే కుట్రకు మోదీ ప్రభు త్వం తెరలేపుతున్నదని, కార్మిక వర్గం కన్నెర్రజేస్తే బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం వేయాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్, మందమర్రి, మందమర్రి మార్కెట్, బెల్లంపల్లి, సీసీసీ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు రణ దీక్షలు చేపట్టగా మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్, టీబీజీకేఎస్, అనుబంధ సంఘాల నాయకులు, సభ్యు లు, ప్రజాప్రతినిధులు, కార్మికులు దీక్షలో కూర్చున్నారు. వీరికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. సింగరేణి నాలుగు బ్లాకులు వేలం వేసి, ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు గనులపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిని కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు.
బీజేపీ సన్నాసులకు ఏం తెలుసు?: బాల్క సుమన్
సింగరేణిని కాపాడుకొనేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మందమర్రి మార్కెట్ ప్రాంతంలో దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ కాదని.. జీవన విధానం అని గుర్తుచేశారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం వేస్తే టీఆర్ఎస్కు ఏమైందని బీజేపీ సన్నాసులు, దద్దమ్మలు అంటున్నారని, వారికి సింగరేణి గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. వారు రాజకీయ కోణంలోనే చూస్తున్నారని, ప్రజల బాగోగులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎవరికి కష్టం వచ్చినా పోరాటం చేయడంలో టీఆర్ఎస్ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పుడు నాలుగు బ్లాకులు, రేపు 14 బ్లాకు లు వేలం వేసేందుకు మోదీ సర్కారు కసరత్తు చేస్తున్నదని తెలిపారు. గుజరాత్లో ఉత్తరం రాస్తే అక్కడ వేలం మానుకున్నారని, ఇతర చోట్ల కూడా ఆయా రాష్ర్టాలు లెటర్లు రాస్తే వేలాన్ని విరమించుకొన్నారని గుర్తుచేశారు. తెలంగాణలో సింగరేణి నాలుగు బ్లాకుల వేలం ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు రాసినా, ఎంపీలు, మంత్రులు, సీఎండీ విన్నవించినా పట్టించుకున్నపాపాన పోలేదన్నారు. వేలంలో పాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణలోని బీజేపీ నాయకులు గుజరాత్కు గులాములుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.