నిర్మల్, జూలై 12 : జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పంట నష్టం, పునరావాస ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయ, ఆర్అండ్ బీ విద్యుత్ శాఖ, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు, అంచనాలతో ప్రాథమిక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితి, ప్రస్తుతం తీసుకున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే సూచనలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్ట్ లలోకి వచ్చి చేరుతున్న వరదను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇన్ ఫ్లో ను బట్టి నీటిని బయటకు వదిలేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని, చెరువులు, కాలువల గండ్లను పూడ్చాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి, పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మి రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముశ్రాఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీ, వ్యవసాయ, ఇతర సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.