హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలుచోట్ల నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రభావితమైన శాస్త్రినగర్, శాంతినగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజనగర్, బుధవారంపేట, హరిజనవాడ, డాక్టర్స్ లేన్లో మంత్రి పర్యటించారు.
వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను, నాలాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు మరో రెండు మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.