హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ. కేశవరావు మృతిపట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చాలా సాధారణ జీవితం గడిపిన జస్టిస్ కేశవరావు మంచి విలువలున్న గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని ఆకాంక్షించారు.
జస్టిస్ కేశవరావు మృతిపట్ల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. సామాన్యులకు న్యాయాన్ని చేరువ చేయడంలో, న్యాయ వ్యవస్థలో విలువలు కాపాడటంలో జస్టిస్ కేశవరావు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. సమాజానికి మేలు చేసిన న్యాయమూర్తికి గౌరవ సూచకంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తోందన్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేశవరావు సేవలు అందించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.