నిర్మల్: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ (Chityala Ailamma) 128 జయంతి వేడుకలను నిర్మల్లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అన్నారు.
పీడిత ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. అలాంటి వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో రజకుల కృషి ఎనలేనిదని, వారి వృత్తి గౌరవ ప్రదమైనదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కోట్లాది రూపాయాలను ఖర్చు చేస్తుందని తెలిపారు. రజకులకు ధోబీఘాట్లే కాకుండా లాండ్రీ దుకాణాలు, నాయీబ్రహ్మణులకు క్షౌర శాలలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నామని వివరించారు.