Minister Indrakaran Reddy | హైదరాబాద్ : జీవ వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న నెహ్రూ జూ పార్కును సీఎం కేసీఆర్ సహకారంతో ప్రపంచస్థాయి జూగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనికోసం అటవీశాఖ పూర్తి సహాయసహకారాలను అందిస్తున్నదని తెలిపారు. నెహ్రూ జూలాజికల్ పార్కులో ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ డైమండ్ జూబ్లీ వారోత్సవాలు (69 వసంతాలు), జూ పార్క్ వజ్రోత్సవాల్లో (60 వసంతాలు పూర్తి చేసుకుంది) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంటిగ్రెటేడ్ ఆన్లైన్ టికెట్ సేవలను మంత్రి ప్రారంభించారు. అలాగే జూ పార్క్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వజ్రోత్సవాల లోగోను, డైమండ్ జూబ్లీ పైలాన్, సెంట్రల్ పౌంటెయిన్ను ఆవిష్కరించారు. దాదాపు 30 ఏండ్ల తర్వాత మళ్లీ సందర్శకుల వీక్షణ కోసం రెండు క్యాపిచినో మంకీస్ను మంకీ మోట్లోకి, రెండు వైట్ టైగర్స్ను టైగర్ మోట్లోకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విడుదల చేశారు. రెండు తెల్ల పులులకు శివపార్వతులుగా మంత్రి నామకరణం చేశారు. జూ సందర్శకుల కోసం ఎలక్ట్రికల్ బైసైకిల్, గ్లాండ్ ఫార్మా దాతృత్వంతో కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ రోడ్ ట్రైన్ సేవలను ప్రారంభించి కాసేపు జూపార్కులో సైక్లింగ్ చేశారు. అనంతరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులను అందజేశారు. జూ పార్కులో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలను అందించిన సిబ్బందిని సత్కరించారు. సామాజిక బాధ్యతగా జూ నిర్వహణకు ఆర్థిక చేయూతనిస్తున్న పలు కంపెనీ యాజమానులు, ఎస్బీఐ ప్రతినిధులను, విద్యాలయాల నిర్వహకులను సత్కరించారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…. సామాజిక బాధ్యతగా వన్యప్రాణుల, పక్షుల ఆలనపాలనకు కావాల్సిన ఆర్థిక చేయూతనిచ్చేందుకు మందుకు వస్తున్న కార్పోరేట్ కంపనీల సేవలు అభినందనీయమని కొనియాడారు. నెహ్రూ జూలాజికల్ పార్కును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారులు, జూ పార్కు ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.