నిర్మల్: రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం (Haritha Haram) కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటుతున్నామని, ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నామన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించోలి-బీ సమీపంలోని గండిరామన్న హరితవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్ సఫారీని (Jungle safari) మంత్రి ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనాన్ని స్వయంగా 5 కిలోమీటర్లు నడిపారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల సంరక్షణ చర్యల వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరగిందని, మహారాష్ట్రలోని (Maharashtra) తడోబా టైగర్ రిజర్వ్ (Tadoba Tiger Reserve) నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్కు (Kawal Tiger Reserve zone) పులులు వలస వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రాన్ని పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. అడవుల ప్రత్యేకత కాపాడుతూనే.. పర్యావరణ హిత టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గండిరామన్న హరితవనంలో సందర్శించే వారికి సరికొత్త అనుభూతిని కల్పించేందుకు రెండు ప్రత్యేక ఓపెన్టాప్ సఫారీ వాహనాలతో పాటు పెట్రోలింగ్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి కోసం రూ.39 లక్షల వెచ్చించామని తెలిపారు. అర్బన్పార్కులో జంగల్ సఫారీని నిర్వహించడం అద్భుతంగా ఉందని కొనియాడారు.
పార్కులో అడ్వెంచర్ కార్యక్రమాలతో పాటు పిల్లలు, పెద్దలందరికీ ఆహ్లాదం, వినోదం కలిగించేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. హరితవనంలో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం, మూషిక జింకల పార్కు, చైన్ లింక్, ఎకో హట్స్, సైక్లింగ్, వాచ్ టవర్స్ చిన్న పిల్లల ఆట స్థలం లాంటి సౌకర్యాలను సందర్శకుల కోసం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న నిర్వహించనున్న హరితోత్సవ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.