Indrakaran Reddy | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్ నగర్లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి ఇంద్రకణ్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత వస్తువుల ప్రదర్శనను మంత్రులు ఆద్యంతం తిలకించారు. అనంతరం కాలుష్య, ప్లాస్టిక్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న వివిధ శాఖల అధికారులు, సంస్థలు, విద్యార్థులకు ప్రోత్సహకాలను, బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మనకు తెలియకుండానే నిత్య జీవితంలో భాగమై… ఎన్నో వ్యాధులు, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో ప్రజలు గుర్తించాలన్నారు. ప్లాస్టిక్–రహిత ప్రపంచం అనేది రాత్రికి రాత్రి జరిగేది కాదని, ప్రభుత్వ సంకల్పం – ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ‘ప్లాస్టిక్–రహిత జీవన విధానాన్ని అనుసరించడం, కలప ఆధారిత వస్తువుల వినియోగం వల్ల ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను కనుగొనవలసిన అవసరం ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో మన తెలంగాణ గణనీయంగా సుస్థిర అభివృద్ధి చెందినట్టే పర్యావరణ పరిరక్షణలో ముందు వరసలో ఉన్నామని చెప్పారు. భవిష్యత్ తరాల మనుగడ కోసం ఎంతో ముందు చూపుతో మన ముఖ్యమంత్రి పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహార కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ మార్గదర్శకుడయ్యారని అన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లు వెచ్చించడం జరిగిందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకున్నామన్నారు. ప్రముఖ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదికలో పచ్చదనం పెంపుతో పాటు పర్యావరణహిత కార్యక్రమాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించిదని చెప్పారు. ఏడు శాతంపైగా హరితవృద్దిని సాధించామని గుర్తు చేశారు.
పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాల వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా పచ్చదనం సంతరించుకుందన్నారు. HMDA, TSIIC ఆధ్వర్యంలో రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకుల్లో అనేక అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గతంలో కాంక్రీట్ జంగల్గా ఉన్న హైదరాబాద్ అంతట పచ్చదనం పరుచుకుందని, అర్బర్ డే ఫౌండేషన్ మన హైదరాబాద్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా గుర్తించిందన్నారు. వ్యర్ధాల నిర్వహణలోనూ GHMC దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, ఈ క్రమంలోనే అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణహితమైన కార్యక్రమాలకు రూపలకల్పన చేసి అమలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.