భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదాబిరాముడు, లోకపావని సీతాదేవి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రాములోరి కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వివరిస్తున్నారు వేద పండితులు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా స్టేడియంలో కల్యాణ వేడుక జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పుర వీధులు మార్మోగుతున్నాయి. అభిజిత్ లగ్నంలో (Abhijit lagnam) సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేయనున్నారు.
సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి కల్యాణ వేడుకకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు.