శివంపేట, ఆగస్టు 14 : భగలాముఖి శక్తిపీఠం నిర్మాణంతో భవిష్యత్లో శివంపేట దివ్య క్షేత్రంగా మారనుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా శివంపేటలో నిర్మిస్తున్న భగలాముఖి శక్తిపీఠం బాలాలయం సన్నిధానంలో లక్ష హరిద్రార్చన కార్యక్రమాన్ని శక్తిపీఠం ఉపాసకులు శాస్త్రల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎప్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ ద్వారా 50 లక్షల రూపాయలను శక్తి పీఠం నిర్మాణానికి సహాయంగా అందజేస్తుందన్నారు. ఆలయ నిర్మాణం పనులు ఆగకూడదన్నారు. నిర్మాణానికి ఇంకా నిధులు కావాల్సి వస్తే అందుకు సహకరిస్తామన్నారు.
కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రా గౌడ్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ, బగలాముఖి శక్తిపీఠం స్థలదాత పబ్బ రమేష్ గుప్తా, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ మన్సూర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.