హైదరాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలోని జోడెఘాట్లో పోరాట యోధుడు కుమ్రంభీం 82వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఘన నివాళలుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జోడెఘాట్ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ క్రమంలోనే కుమ్రంభీం జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కుమ్రంభీం స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీం పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలిసేలా హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్బండ్పై కుమ్రంభీం విగ్రహాన్ని ప్రతిష్టించామన్నారు.
ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తెలిపేలా రూ.55 కోట్లతో ఆదివాసీ భవనాన్ని నిర్మించి, ప్రారంభించామన్నారు. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాలున్న ఆరుశాతం ఉన్న రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీం చేసిన సేవలకు గుర్తుగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, రెండోదశలో మరిన్ని చెక్డ్యామ్ల నిర్మాణానికి తర్వలోనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. గిరిజనులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోడు సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చేసిందని, ప్రస్తుతం దీనిపై హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు.
ప్రస్తుతానికి పోడు భూముల సర్వే పనులు కొనసాగుతున్నాయని, కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేస్తామన్నారు. గిరిజన తెగల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను త్వరలోనే పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, మాజీ ఎంపీ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.