హైదరాబాద్: సమాజానికి, ప్రకృతికి మేలు చేకూర్చే అటవీ సంపదను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని జూ పార్కు వద్ద స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. అటవీ సంపదను కాపాడటంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అటవీ సంపదను కాపాడడంలో సిబ్బంది తమ విధులను అణుమాత్రం కూడా విస్మరించలేదన్నారు. అటవీ అధికారుల రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
అమూల్యమైన అటవీ సంపదను పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యంతో అనేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జంగిల్ బచావో- జంగిల్ బడావో అనే నినాదంతో ఇప్పటికే ఉన్న అడవుల రక్షణ, క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కోసం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో అడవుల రక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం.. పచ్చదనం పెంపుదలలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమి వెల్లడించారు. ఇప్పటివరకు 232 కోట్లకు పైగా మొక్కలను నాటామన్నారు.