నిర్మల్ : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మినీ ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఇందులో విద్య, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన సంక్షేమ పథకాలు దళిత సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని తెలిపారు. దళితుల్లో అన్ని కేటగిరీల్లోని వారికి సంక్షేమ ఫలాలు అందేలా రూపొందించిన ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో, రాష్ట్రేతర మేధావుల సైతం ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రైతు బంధు తరహాలో ప్రతి దళిత కుటుంబానికి ప్రత్యక్షంగా మేలు చేసేలా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
దశల వారీగా రాష్ట్రంలోని కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాలు అందివ్వడం ప్రభుత్వ లక్ష్యంగా… 2022-23 వార్షిక బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రత్యక్షంగా 17 లక్షల కుటుంబాలకు, పరోక్షంగా కోటి మందికి దళిత బంధు పథకం ద్వారా మేలు జరగనుందన్నారు. దీంతోపాటు దళిత విద్యార్థులకు ఉపకార వేతనాలు, గురుకుల సంక్షేమ హాస్టళ్లు, ఎస్టీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ స్టడీ సర్కిళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.