నిర్మల్: జాతీయ పతాక కీర్తిని నలుదిక్కులా చాటాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్లోని శ్యాంఘడ్ కోట నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ప్రీడం రన్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరిలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని 15 రోజుల పాటు ద్విసప్తాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులను స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగస్వాములను చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బొర్కడే, తదితరులు పాల్గొన్నారు.