నిర్మల్ : జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల మూలంగా నిర్మల్ – మంచిర్యాల ప్రధాన రహదారిపై మామడ మండలం న్యూ సాంగ్వి వద్ద అప్రోచ్ రోడ్ కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దారి మళ్లించాలని అధికారులను ఆదేశించారు. రహదారికిరువైపులా బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ రహదారి గుండా ప్రయాణించే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయన్నారు.
వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అక్కడక్క ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ ముశ్రప్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.