నిర్మల్: ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పేదలకు మరింత దగ్గరగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నేడు బస్తీ దవాఖానలు ప్రారంభించామన్నారు. దీంతో ఇక్కడి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. బస్తీ దవాఖానల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడంతో పాటు స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందిస్తారన్నారు. అదేవిధంగా టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, యోగ లాంటివి చేసి శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలి గిరిజన ప్రజలు మరణించేవారని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వైద్య సేవలు మెరుగుపడ్డాయని, సీజనల్ వ్యాధులు, విష జ్వారాల వల్ల మరణాలను పూర్తి నిరోధించగలిగమని పేర్కొన్నారు.
పచ్చదనం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ.. పల్లె, పట్టణ కార్యక్రమాలు చెపట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఏంఏం సమస్యలను పరిష్కరించ గలిగాము? రానున్న రోజుల్లో పరిష్కారించాల్సిన సమస్యలు ఏంటని? అధికారులు, ప్రప్రతినిధులు సమీక్ష చేసుకోవాలని సూచించారు.