నిర్మల్ : జిల్లాలోని సారంగపూర్ మండలం ఆలూర్లోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో పోషక ఉద్యాన వనాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. గురువారం సారంగాపూర్ మండలం ఆలూరు బృహత్ పల్లె ప్రకృతి వనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, సమగ్ర శిశు మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ‘పోషక ఉద్యానవనం’, ‘మన అంగన్వాడీలు- మన ఆకుకూరలు’ అనే కార్యక్రమాన్ని పల్లె ప్రకృతి వనంలో విత్తనాలు చల్లి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రయోగాత్మకంగా ఆలూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇందులో ఎకరంలో వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తారన్నారు. ఇక్కడ పండిచిన కూరగాయలను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారని మంత్రి తెలిపారు.
ఇందులో ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ అంగన్వాడీల ద్వారా అందజేస్తామన్నారు. అంతకుముందు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, ఎంపీడీఓ, ఎంపీవో, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.