నిర్మల్ : రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని నగర్, లక్ష్మణచాంద మండలం రాచాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి ప్రారంభించారు.
నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న రేణుకా మాత ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రైతులకు తీవ్ర అన్యాయం చేశాయని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్నారు. పంటను దళారులకు అమ్మి మోసపోకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మత రాజకీయాలు చేసే బీజేపీ సర్కారు రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మొదట్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల పక్షాన ఢిల్లీలో పోరాటం చేసినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆలోచించి ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.