హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమైనట్టు దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. సోమవారం నుంచి విద్యార్థులు తరగతులకు హాజరవుతారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. శనివారం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్కుమార్, ఎస్పీ ప్రవీణ్కుమార్ స్టూడెంట్ యాక్టీవిటీ సెంటర్లో విద్యార్థులతో చర్చలు జరిపారు.
అనంతరం బాసర ఆలయం వద్ద గల రెవెన్యూ గెస్ట్హౌస్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ఒప్పుకున్నట్టు తెలిపారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ ద్వారా ట్విట్టర్ వేదికగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరినట్టు చెప్పారు. ప్రభుత్వం తరఫున తాము హామీ ఇస్తున్నామని, కొన్ని డిమాండ్లకు సమయం పడుతుందని తెలిపామని పేర్కొన్నారు. వీసీ నియామకానికి ఆర్జీయూకేఈటీ 18వ చట్టం వల్ల సాంకేతిక సమస్య ఉన్నదని, కొత్తగా డైరెక్టర్ను నియమించామని, ఆయన క్యాంపస్లో ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని విద్యార్థులకు చెప్పినట్టు వెల్లడించారు. ఎలాంటి సమస్య వచ్చినా డైరెక్టర్కు తెలియజేయాలని సూచించామని తెలిపారు.
నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి
అన్ని డిమాండ్లతోపాటు అదనంగా నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ తెలిపారు. వివిధ ఐఐటీల్లోని ప్రొఫెసర్లతో ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా చూస్తామని చెప్పారు. వివిధ కాలేజీల్లోని ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. లైబ్రరీతోపాటు పీయూసీ తరగతులు నిర్వహించే గదులను రెనోవేషన్, నీటి, కరెంటు సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ట్రిపుల్ ఐటీ ఏవో రాజేశ్వర్రావును తొలగిస్తూ వైస్ చాన్స్లర్ రాహుల్బొజ్జా శనివారం ఆదేశాలు జారీ చేశారు. రాజేశ్వర్రావు కొన్నేండ్లుగా అడ్మినిస్ట్రేవ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలి: ఎస్జీసీ
బాసర ట్రిపుల్ఐటీలో తమ డిమాండ్లను నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలని, ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల అయ్యాకే తమ ఆందోళనను విరమిస్తామని స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ) గురువారం ట్విట్టర్లో పేర్కొన్నది. అప్పుడే తరగతులకు కూడా హాజరవుతామని తెలిపింది. దీంతోపాటు సీఎం కేసీఆర్ తమ డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తిచేస్తూ విద్యార్థులు వీడియో ద్వారా సోషల్ మీడియాలో ఒక సందేశం పంపారు.
విద్యార్థులను చూస్తే తల్లిగా నాకు బాధేస్తున్నది: మంత్రి సబిత
బాసర విద్యార్థులు ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ.. నిరసన తెలపడం చూస్తే ఓ తల్లిగా బాధేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులు విజ్ఞతతో ఆలోచించి.. ఆందోళనను విరమించాలని అధికారుల చర్చలకు ముందే శనివారం ట్విట్టర్లో ఆమె సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. యూనివర్సిటీలు ఎప్పటికీ రాజకీయాలకు వేదికలు కావొద్దని పేర్కొన్నారు. ‘ఇది మీ ప్రభుత్వం. మీ సమస్యల కోసం అనునిత్యం ఆలోచించే ప్రభుత్వం. మీ బంగారు భవిష్యత్తే మీ తల్లిదండ్రుల కల. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ కల కూడా. అందుకే దయచేసి ఆందోళనను విరమించండి. సామరస్య ధోరణిలో చర్చించండి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించండి.’ అంటూ మంత్రి విద్యార్థులకు విన్నవించారు.