దిలావర్పూర్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27తో వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్యాకేజీ 27 పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్యాకేజీ 27 పనుల్లో భాగంగా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రూ.290 కోట్లను మంజూరు చేశారన్నారు. త్వరలోనే ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి నీరు తీసుకొచ్చి సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొన్నామని చెప్పారు. అనంతరం న్యూ లోలం గ్రామంలో నిర్మించిన మోడల్ అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టు, వాలీబాల్, షటిల్ కోర్టులను ప్రారంభించిచారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.