హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనకుండా అరిగోస పెట్టిన గోయల్కు తెలంగాణ రైతన్నల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఆయా రామ్.. గయా రామ్లతో తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. పది సభలు పెట్టినా వారిని నమ్మరన్నారు. ఎనిమిదేళ్లలో కేంద్రం తెలంగాణకు చేసిందేమిటో చెప్పకుండా నీళ్లు, నిధులు, నియామకాల గురించి పదే పదే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని 2014లో మేనిఫెస్టోలో ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి ప్రశ్నించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ప్రధాని మోదీ, అమిత్షా, నడ్డా, పీయూష్ గోయల్ తమ సొంత డబ్బా కొట్టుకోవడమే కానీ.. తెలంగాణ అభివృద్ధి ఏం చేస్తారో చెప్పలేదన్నారు. తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం తప్ప.. తెలంగాణకు పనికొచ్చే మాట ఒక్కటీ చెప్పలేదని విమర్శించారు.