నిర్మల్ : బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నామని, ఏనాడు వ్యక్తిగత దూషణకు దిగలేదని, కానీ బ బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఏనాడు వ్యక్తిగత దూషణలకు దిగలేదు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం కామన్. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళలు, చిన్న పెద్ద, అనే తేడా లేకుండా బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన నిర్మల్ సభలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వారిలా మేము తిట్టదలుచుకోలేదు.. మాకు సంస్కారం ఉందన్నారు.
అభివృద్ధి పై విమర్శలు చేయండి, ఫలానా వ్యక్తి ప్రభుత్వ పథకాలు రాలేదని చూపించండి తప్పులేదు. కానీ వ్యక్తిగత దూషణలు అది కూడా అన్ పార్లమెంటరీ మాటలు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా? కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.
గడిచిన 8 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపించ లేదా? ప్రజా సంగ్రామ యాత్రలో బూతు పురాణం తప్ప ప్రజలకు పనికి వచ్చేది ఒక్క విషయం అయినా మాట్లాడారా? అని నిలదీశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, నిర్మల్ నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పారా? బీజేపీ నేతలు స్టేట్మెంట్లకే పరిమితం అయ్యారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క హామీనైనా ఇచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
రైల్వే లైన్ ఏర్పాటు ఏమైంది, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిర్మల్లో సైన్స్ సెంటర్, ప్లానెటోరియం ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని అడిగితే కేంద్రాన్ని కోరితే నిధులు ఇచ్చారా? అని కడిగి పారేశారు. వేలాది మందికి ఉపాది చూపే సీసీఐ పునరుద్ధరణకు ఎలాంటి సహయసాకారాలు అందించేందుకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రానికి ఎన్ని లేఖలు రాసిన కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదని మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్ర అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగిన కేంద్రం నుంచి సమాధానం లేదు. బీజేపీ నాయకులు మాత్రం ఇవేమి మాట్లాడకుండా తిట్టడం ధ్యేయంగా ఇక్కడ సభ పెట్టుకున్నారని ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు.