నిర్మల్ : మాయమాటలు, అబద్దపు ప్రచారాలతో పబ్బం గడుపుకునే ప్రతిపక్షాల మాటలు విని బతుకులు ఆగం చేసుకోవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran reddy) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్(BRS) మండల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. స్వరాష్ట్రంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు.
పల్లె, పట్టణమనే తేడా లేకుండా రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని,కండ్ల ముందు కనిపిస్తున్న ప్రగతిని దూరం చేసుకోవద్దని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత (BJP Ruling states) రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఉమ్మడి పాలనలో సాగునీటి కొరత కారణంగా రైతులు వర్షాధార పంటలు సాగు చేసేవారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి(Irrigation Sector) పెద్దపీట వేసిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మరమ్మతులు, కాలువల ఆధునికీకరణ, మిషన్ కాకతీయ పథకం చెరువులను బాగు చేసుకోవడంతో రెండు పంటలకూ సరిపడా సాగునీరు అందుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిర్మల్ జిల్లాల్లో ఏటా సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.ఈ సమ్మేళనానికి బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి వి. గంగాధర్గౌడ్ అధ్యక్షత వహించగా మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.