నిర్మల్: వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసంపై నల్లజెండాను ఎగురవేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నల్లజెండాలను ఎగురవేసి రైతులకు సంఘీభావం తెలపాలని కోరారు. తెలంగాణ రైతన్నలు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్షను వీడనాడాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనేదాకా రైతుల తరపున కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఊరూరా ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేలని, గ్రామ కూడళ్లలో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసి ఢిల్లీ వరకు ఈ నిరసన సెగలు తాకేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుకు మద్దతుగా నిర్మల్ నియోజకవర్గంలో లక్ష ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేస్తామన్నారు. అంతకుముందు పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.