ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఉగాది రోజున గవర్నర్ యాదాద్రికి వెళ్లారు. 20 నిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్ పాటించడం కష్టంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గవర్నర్ నోరు పారేసుకోవడం మానుకోవాలి. ఆమె తన పరిధిలో ఉంటే అందరూ గౌరవిస్తారని మంత్రి పేర్కొన్నారు.
గవర్నర్ రాజ్యాంగ పరంగా నడుచుకునే విధంగా వ్యవహరించాలన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగిన తమిళిసై.. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వక్రబుద్ధితో వ్యవహరించడం సరికాదన్నారు. తాను అసెంబ్లీని రద్దు చేసేదాన్ని అని తమిళిసై మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీని రద్దు చేసిన రామ్ లాల్కు ఏం జరిగిందో తమిళిసై గుర్తుకు తెచ్చుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.