నిర్మల్ : కేంద్రంలోని నరేంద్ర మోదీ( Narendra Modi) సర్కార్ పెంచుతున్న నిత్యవసర ధరల వల్ల సామాన్యులు సతమతమవుతున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పేర్కొన్నారు. నిర్మల్ నియోజక వర్గంలోని మామడ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి గంగాధర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులు, సామాన్య ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రధాని మోదీ ధరలను పెంచుతూ సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు అందజేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్రోల్(Petroll), డీజిల్(Diesel) ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రజల గురించి ఎంతో గొప్పగా ఆలోచించే వ్యక్తి కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉండటం అందరి అదృష్టమన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి మరోసారి పార్టీకి అఖండ విజయం అందించాలని కోరారు.