హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణాలో పచ్చదనం దిశగా చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందాయి. కేంద్రం నుంచి కూడా అనేక ప్రశంసలు పొందినట్లు తెలిపారు. జంగల్ బచావో – జంగల్ బడావో నినాదం తీసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని స్పష్టం చేశారు. గత ఏడేండ్లలో గణనీయంగా పచ్చదనం పెరిగింది. 24 నుంచి 31 శాతానికి పచ్చదనం పెరిగిందన్నారు. ప్రకృతిని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ హరితనిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. అక్రమంగా చెట్ల నరికివేత, స్మగ్లింగ్ దాదాపుగా అరికట్టామని చెప్పారు. వాతావరణ మార్పులకు విరుగుడు తమ చేతుల్లోనే ఉందని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జాతీయ అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సీపీ గోయల్, నేషనల్ కాంపా సీఈవో సుభాష్ చంద్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారితో పాటు అన్ని రాష్ట్రాలకు పీసీసీఎఫ్లు, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.