Indrakaran Reddy | నిర్మల్ : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 10 వేలు సహాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ( Telangana ) మాత్రమే అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి( Indrakaran Reddy ) అన్నారు. పంట నష్టపోయిన రైతులకు( Farmers ) ఎకరాకు రూ. 10 వేల సహాయం చేస్తామని ప్రకటించి సీఎం కేసీఆర్( CM KCR ) రైతులకు అండగా నిలిస్తే.. దీన్ని కూడా బీజేపీ( BJP ), కాంగ్రెస్( Congress ) పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎక్కడైనా రూ. 10 వేలు పంట నష్టం కింద ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అదే విధంగా నిరంతరం నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పెంచుతూ.. పేద ప్రజలపై కేంద్రం ఆర్థిక భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవితను బీజేపీ కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా చేసిందన్నారు. విచారణ పేరుతో గంటల కొద్ది విచారిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు.
దిలావర్ పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో రైతులు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో సంక్షేమ పథకాలతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ బలోపేతానికి ఆత్మీయ సమ్మేళనాలను వేదికగా మలుచుకోవాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని నాయకులకు, కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని, నిర్మల్ జిల్లాకు కేంద్రీయ విద్యాలయం, నవోదయ పాఠశాల మంజూరు చేయాలని, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నా.. ఉలుకు పలుకు లేదని కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తప్పుపట్టారు.