హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యం..సమిష్టి బాధ్యతతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లోని స్టాళ్లను మంత్రి పరిశీలించారు. గాలి కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రజలు కూడా పర్యావరణ సమతుల్యత పట్ల అవగాహనతో మసలుకోవాలన్నారు. సామాజిక బాధ్యతగా ప్రకృతి వనరులను పొదుపుగా వాడడం, వాయు, జల, నేల కాలుష్యం కాకుండా మన వంతు ప్రయత్నాలు చేసినప్పుడే కాలుష్యరహిత రాష్ట్రం, దేశాన్ని తయారు చేయగలమని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నారని వెల్లడించారు.
హరితహారం, స్వచ్ఛ తెలంగాణ, జలహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ కాకతీయ లాంటి అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజలందరి భాగస్వామ్యంతో వీటిని విజయవంతంగా అమలయ్యేలా చూస్తున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమం ద్వారా ఏడు విడతల్లో 250 కోట్ల మొక్కలు నాటామని, ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 19.54 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి పల్లె, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా దాదాపు 92 వేల కిలోమీట్లర్ల మేర మొక్కలను నాటామన్నారు.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు కాలుష్య నియంత్రణ మండలి అనేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. జల, వాయు, నేల కాలుష్యం నివారణ, నియంత్రణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పీసీబీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
అనంతరం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణలో భాగంగా పరిశ్రమల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడం, గాలి, జల, నేల కాలుష్య నియంత్రణకు చొరవ తీసుకుంటున్న ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్, మేధ సర్వో డ్రైవ్స్, డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్, బయోకాన్ పరిశ్రమల ప్రతినిధులకు పురస్కారాలను ప్రదానం చేశారు. పర్యావరణంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటిల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మక్కజొన్న పిండితో తయారైన పర్యావరణహిత సంచులను (క్యారీ బ్యాగ్) ఆవిష్కరించారు..
ఈ కార్యక్రమంలో అప్పిలేట్ అథారిటీ చైర్మన్ ప్రకాశ్రావు, మెంబర్ డాక్టర్ జయతీర్ధరావు, ఎస్ఈఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్ శివకుమార్, కార్పొరేటర్ లక్ష్మి బాల్రెడ్డి, సీఈ డీ రఘు, పీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీవాత్సవ్, కార్యదర్శి కృపాకర్, తదితరులు పాల్గొన్నారు.