హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉన్నదని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర రాష్ర్టాల మంత్రులు, వివిధ సంస్థల ప్రతినిధులు పచ్చదనం పెంపునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మెచ్చుకుంటున్నారని అన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ అటవీశాఖ మంత్రి అరుణ్కుమార్.. హరితహారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులు బాగున్నాయని అభినందించారని మంత్రి గుర్తుచేశారు. అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీశాఖ సిబ్బంది కనబరిచిన త్యాగాలకు విలువ కట్టలేమన్నారు.
అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నెహ్రూ జూ పార్కులోని స్మారక చిహ్నంపై మంత్రి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1984 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మంది అటవీ అధికారులు విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. అటవీ సంపదను కాపాడే విషయంలో ప్రతి ఒకరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. అమరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అటవీశాఖ బలోపేతానికి ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం 92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. అటవీ అధికారులు, సిబ్బందికి 2,173 వాహనాలను అందజేసినట్టు చెప్పారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 268.75 కోట్లకు పైగా మొకలను నాటామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, అటవీశాఖ స్పెషల్ సీఎస్ ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అటవీశాఖ సలహాదారు ఆర్ శోభ, రిటైర్డ్ పీసీసీఎఫ్లు పీ మల్లికార్జున్రావు, మునీంద్ర, జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.