హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తమకు సంబంధం లేదని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు.. సిట్ ఏర్పాటు చేస్తే ఎందుకు భయపడుతున్నారని హరీశ్రావు ప్రశ్నించారు. ప్రగతి భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలు దొరికిపోయనటువంటి బీజేపీ దొంగల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల మారిపోయింది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు మాకు తెలియదని బుకాయించారు. మారు వేషాల్లో వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు తమకు తెల్వనే తెల్వదని బీజేపీ నాయకులు చెప్పారు. ప్రభుత్వం వారిని అరెస్టు చేసి, జైలుకు పంపిన తర్వాత బీజేపీ నాయకుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది. పార్టీ అధ్యక్షుడేమో తడి బట్టలతో ప్రమాణం చేస్తానని అంటాడు. ఈ కేసును విచారణ చేయొద్దని బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంటాడు. ఈ కేసు విచారణ ఆపండి. ఢిల్లీకి ఇవ్వండంటూ కోర్టుల్లో పిటిషన్ వేస్తాడు. తడిబట్టలు, పొడిబట్టలు, ప్రమాణాలు అంటున్నారు. కేసు విచారణ ఆపాలనేమో పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టుల్లో కేసులు వేస్తాడు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టి తెలంగాణకు వచ్చి, దొరికిపోయేసరికి కుడితిలో పడ్డంత పనైంది అని హరీశ్రావు అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో మఠాధిపతులను, స్వామిజీలను తెలంగాణలో నగ్నంగా ప్రభుత్వం బయటపెట్టింది. ఆ దొంగలను ప్రభుత్వం జైల్లో పెట్టింది. దీంతో వారు ఆగమాగం అవుతున్నారు. నిద్ర కూడా పోతలేన్నట్టుంది. 24 గంటలు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. మీకు సంబంధం లేకపోతే కోర్టుల తలుపులు ఎందుకు కొడుతున్నారు. ఈ కేసుతో మాకు సంబంధం లేదని టీవీ చర్చల్లో చెబుతున్నారు. వారెవరో తెలియదని, వారిని కేసీఆరే పంపిండని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి సంబంధం లేకపోతే బీజేపీ ప్రధాన కార్యదర్శి సిట్ను రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు.
మొన్ననేమో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. పాదర్శకంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిట్ ఏర్పాటు చేస్తే, రద్దు చేయాలని కోర్టులో కేసు వేశారు. బీజేపీ బండారం బయటపడుతదనో ఉద్దేశంతో, దీన్ని ఆపాలని చూస్తున్నారు. పరువు కాపాడుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. నిజాన్ని ఒప్పుకోవడమే మీ ముందున్న మార్గం. మరో గత్యంతరం లేదు. బీజేపీ నాయకులను ప్రజలు గమనిస్తున్నారు. కేసుతో సంబంధం లేదంటూనే ప్రధాన కార్యదర్శి కేసులు ఎందుకు వేస్తున్నారు. ఢిల్లీ, గల్లీ నాయకులు గత్తర గత్తర అవుతున్నారు. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు.. కేసు త్వరగా విచారణ జరగాలని, నిజ నిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తారు. కానీ దర్యాప్తు మీద స్టే ఇవ్వాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా బీజేపీ బ్రోకర్ల వీడియోల గురించి ప్రస్తావించినట్లు వార్తా పత్రికలు, టీవీల్లో చూసినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు.
గవర్నర్ నిన్న తుషార్ పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియదు. మేం మాట్లాడిందేమో రాహుల్ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయిన తుషార్ గురించి. ఆమెనేమో తన వ్యక్తిగత ఏడీసీ తుషార్ గురించి మాట్లాడారు. తుషార్ ప్రస్తావన ఎందుకు తెచ్చిందో అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఇవాళ మేం పత్రికల్లో చూశామని తెలిపారు.
బీజేపీ నాయకులకు తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల మీద కుట్రపూరితమైన వైఖరిని బీజేపీ అవలంభిస్తుంది. దొంగను పట్టుకోవడం తప్పా? ఎమ్మెల్యేలను కొంటామని చెప్పి అడ్డంగా దొరికిపోయిన తర్వాత వారిని అరెస్టు చేయడం తప్పా? గంటకో మాట మాట్లాడుతున్నారు. దొరికిపోయి పూటకో మాట మాట్లాడుతున్నారు. కోర్టుల్లో ఒకటి, ప్రెస్మీట్లలో ఒకటి, టీవీ చర్చల్లో ఒకటి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకుల బహురూప వేషాలను, నాటకాలను తెలంగాణ ప్రజలు గమనించాలి. నగ్నంగా దొరికిపోయి, బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధం లేని కేసు అయితే ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. చిత్తశుద్ధి ఉంటే విచారణకు సహకరించండి. బీజేపీ నాయకులు దొరికిపోయిన దొంగలు. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ధర్మం, న్యాయం గెలుస్తుందన్న విశ్వాసం మాకుందని హరీశ్రావు స్పష్టం చేశారు.