సిద్దిపేట : పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర చివరి రోజున భారీగా భక్తులు తరలివచ్చారు. ఇందులో భాగంగా సోమవారం స్వామి వారి కల్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా కొలువుదీరిన పాలక మండలిని మంత్రి శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయం దినదినాభివృద్ధి జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కొండపై వివాహాలు చేసుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పుల్లూరు బండ క్షేత్రంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కన్నుల పండువగా బండ జాతర జరిగిందని తెలిపారు. నూతన పాలకవర్గం ఆధ్యాత్మిక సేవలో భాగస్వామ్యం కావాలని కోరారు.
జిల్లాలో ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రమైన పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వందల వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందన్నారు. వంద ఎకరాల ఏకశిలా బండపై వెలిసిన గొప్ప మహిమాన్వితం శ్రీ స్వయంభూ నృసింహ స్వామి అని పేర్కొన్నారు. 800 ఏండ్ల క్రితం కాకతీయుల కాలంలో ఇక్కడ దేవాలయం నిర్మించారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా ఇక్కడ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు.
భక్తుల సౌకర్యం కోసం బండపైకి వాహనాలు వెళ్లడం కోసం రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించామని మంత్రి తెలిపారు. పుల్లూరు బండపై 24 గంటలు మంచి నీటి సౌకర్యం కోసం రూ. 70 లక్షలతో 1 లక్ష 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను నిర్మించామని తెలిపారు. పుల్లూరు బండ స్టేజీ వద్ద రూ. 10 లక్షలతో దేవాలయ కమాన్ను ఏర్పాటు చేశామన్నారు. రూ. 50 లక్షలతో దేవాలయం పక్కన కళ్యాణ మండపం నిర్మించామని చెప్పారు. భక్తులు, దాతల సహకారంతో రూ. 10 లక్షలతో దేవాలయ ప్రాంగణంలో షెడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ. 15 లక్షలతో సుందరమైన సుడా పార్కును ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవలే మరో రూ. 50 లక్షలు దేవాదాయశాఖ ద్వారా మంజూరు చేసుకున్నాం. ఈ నిధులతో భక్తుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం చేపడుతామని హరీశ్రావు వివరించారు.