ఆరు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లా కేంద్రాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయని, రోడ్లు, ఇండ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. దూప్సింగ్ తండాలో రోడ్లు దెబ్బతిని రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పారు. దూప్సింగ్ రోడ్డుపై శాశ్వతంగా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
నర్సాపూర్ లో కోర్టు భవనం కూలిపోయిందని, దానికి సీడీపీఓ భవనాన్ని తాత్కాలికంగా కేటాయించినట్లు మంత్రి హరీశ్రావు వివరించారు. జిల్లాల్లో 370 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఒక్కొక్కరికీ రూ. 3,200 పరిహారం చెల్లిస్తామని చెప్పారు. జిల్లాల్లో చెరువులు పూర్తిగా నిండాయని, పోచారం ప్రాజెక్టు, చెరువులోకి ప్రజలు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని, పాత ఇళ్లలో ఉన్న వారిని క్షేమంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
తెలంగాణ రైతులపై బీజేపీ వివక్ష
తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తొండి ఆట ఆడినా ప్రతి గింజనూ కొన్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. బీజేపీ నాయకులు బియ్యం తీసుకుంటామని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, నూకల నష్టాన్ని తామే భరిస్తామని చెప్పినా ఇప్పుడు బియ్యం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వర్షాలతో వడ్లు మొలకెత్తుతున్నాయని చెప్పారు. బియ్యం ఎందుకు కొంటలేరో టీబీజేపీ నాయకులు తెలంగాణ రైతులకు చెప్పాలన్నారు.
బీజేపీ సర్కారు సహకరించకున్నా రాష్ట్ర రైతాంగాన్నిటీఆర్ఎస్ సర్కారు కాపాడుకుంటుందని మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో రైతు బంధు ద్వారా రూ. 7,500 ఇచ్చామని చెప్పారు. వానాకాలానికి సంబంధించి నీటి సరఫరా నిర్ణయం తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను అదేశించినట్లు తెలిపారు. పంచాయితీ రోడ్ల మరమ్మతుల కోసం రూ. 85 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై సమీక్షించామని, త్వరితగతిన ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ. 6 కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్లల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఆగస్టు 7న మెదక్ నియోజకవర్గంలో వెయ్యి ఇల్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు రెండో వారంలో తూఫ్రాన్, వెల్దుర్తిల్లో ప్రారంభిస్తామని చెప్పారు.ఆరునెలల్లో రైల్వేలైన్ కోసం రాష్ట్ర సర్కారు రూ. 50 కోట్లు కేటాయించిందని తెలిపారు. త్వరలోనే ఎరువుల కోసం మెదక్లో ర్యాక్ పాయింట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.