బీజేపీ తీరు ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడి మల్లన్న’లా ఉందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. పెట్రో ధరల పెంపు విషయంలో కేంద్ర సర్కారుపై ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రతి సందర్భంలోనూ ఎండగడుతున్నామని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతాయని తాము ముందు నుంచే చెబుతూ ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.
అంచనా వేసినట్టుగానే ధరలు భారీగా పెంచిన బీజేపీ ప్రభుత్వం..మరోసారి తన మోసపూరిత వైఖరిని చాటుకుందని హరీశ్రావు ట్వీట్ చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర సర్కారు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు చెప్పి, ఎన్నికలు ముగియగానే తన ప్రజా వ్యతిరేక నైజాన్ని భయటపెడుతోందని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెంచిందన్నారు. ఎన్నికల వేళ దొంగ వినయం ప్రదర్శించిన బీజేపీ ప్రభుత్వం, ఎన్నికలు పూర్తి కాగానే ప్రజల నడ్డి విరిచేలా ధరలు పెంచిందని మండిపడ్డారు. కరోనాతో ఆదాయం కోల్పోయిన ప్రజలకు ధరల పెంపుతో కష్టాలు రెట్టింపు కానున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.