Minister Harish Rao | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్యసేవలు అందించేందుకు అవసరమైతే హెలికాప్టర్ను వినియోగిస్తామని చెప్పారు. గురువారం ఆయన వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ప్రజలకు వైద్యసేవల విషయంలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ప్రజలకు నిరంతర వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఇదే తరహాలో జిల్లా స్థాయిలో కాల్ సెంటర్, జిల్లా, ఏరియా, సీహెచ్సీ, ఎంసీహెచ్ దవాఖానల వారీగా ఎమర్జెన్సీ వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. 108, 102 వాహన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించాలని, ప్రసవ తేదీ సమీస్తున్న గర్భిణులకు, డయాలసిస్ పేషెంట్లకు అవసరమైన వైద్యసేవలు అందేలా చూడాలని కోరారు. ఆహారం కలుషితం కాకుండా ఆహార నాణ్యతపై దృష్టి సారించాలని, మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించాలని ఆదేశించారు.
దవాఖానలు, వార్డులు, పరిసర ప్రాంతాల్లో శుభ్రత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదే అని స్పష్టంచేశారు. పీహెచ్సీ స్థాయిలో పాముకాటు, తేలుకాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పీహెచ్సీల్లో మందులను నిల్వ ఉంచుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల అరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, ఆయుష్ డైరెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.