Minister Harish Rao | సంగారెడ్డి, జూన్ 6 (నమస్తే తెలంగాణ)/మునిపల్లి: ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా మరింత సస్యశ్యామలం కానున్నది. దశాబ్దాలుగా పరితపించిన రైతు ల సాగునీటి కల తీరనున్నది. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది. ఈ ఎత్తిపోతలతో అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పనులను సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మడలో బుధవారం మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఇక్కడే పంప్హౌస్ నిర్మాణానికి 35 ఎకరాలను అధికారులు సేకరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి జిల్లాకు వచ్చే గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు వీలుగా జహీరాబాద్ నియోజకవర్గంలో మంజీరా నది సమీపంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూ.2,653 కోట్లతో చేపడుతున్నారు. దీనిద్వారా జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజక వర్గాల్లోని 11 మండలాల పరిధిలో 231 గ్రామాలకు సాగునీరు అందనున్నది. మొత్తం 2.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు చేరనున్నది. ఈ ఎత్తిపోతలకు మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీల నీటి వాటాను ప్రభుత్వం కేటాయించింది. జహీరాబాద్ మండలం హోతి(కే), మునిపల్లి మండలం చిన్నచెల్మడలో పంప్హౌస్లు నిర్మిస్తారు. ఇతర అవసరాలకు113 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుందని ప్రభుత్వం గుర్తించింది. 240 కిలోమీటర్లతో 12 ప్రధాన కాల్వలు, 1,100 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మించనున్నది. వీటి నిర్మాణ పనులకు మొత్తం 6,727 ఎకరాల భూమి ప్రభుత్వం భూసేకరిస్తున్నది.