సంగారెడ్డి : రెండేండ్లలో సంగమేశ్వర ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆందోళ్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తాము అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తద్వారా ఆందోళ్ తప్పకుండా మరో కోనసీమ అవుతుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన నేపథ్యంలో ఆందోల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి హరీశ్రావు పాల్గొని మాట్లాడారు.
నెత్తిన మంజీరా నది ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా ప్రజలు తాగునీటికి కష్టాలు పడ్డారు. సాగు, తాగు నీటి కష్టాలను తీర్చేందుకు ఈ నెల 21న సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోనే 1,61,000 లక్షలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.
గోదావరి నీళ్లతో సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజీరా నదిపై ఒక్క చెక్ డ్యాం కూడా నిర్మించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజీరాపై 14 చెక్ డ్యాంలు నిర్మించామని స్పష్టం చేశారు. రైతు కోసం ఆలోచించే ఒకే నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మదన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.