Minister Harish rao | హుస్నాబాద్, జూన్ 9: ఎన్ని అడ్డంకులు ఎదురైనా మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ను ఎట్టకేలకు పూర్తి చేసుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ వానకాలం సీజన్లోనే సీఎం కేసీఆర్ను తీసుకొచ్చి కటుక ఒత్తుడే.. రిజర్వాయర్ల గోదారమ్మ నీళ్లను పోసుడేనని ఈ ప్రాంత ప్రజలకు భరోసా కల్పించారు. ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లు పట్టిపీడిస్తున్న కరువు కనుమరుగై ఇక్కడి ప్రజల గోస తీరినట్లయ్యిందని తెలిపారు. రిజర్వాయర్ను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశాయని, వాటన్నింటినీ ఎదుర్కొని మెట్ట ప్రజల కోసం సీఎం కేసీఆర్ కృషితో పూర్తి చేసినట్టు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంక్షేమ సంబురాలకు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు గౌరవెల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ను కొన్ని పార్టీల నాయకుల కౌరవుల్లా అడ్డుకున్నారని, చివరకు ధర్మమే గెలిచి పనులు పూర్తయినట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూనిర్వాసిత గిరిజనులు 185 మందికి రూ.8 లక్షల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్టు తెలిపారు. ఇంటి స్థలం ఇచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. రిజర్వాయర్ పనులు పూర్తి కావడంలో స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ కృషిని అభినందించారు. రిజర్వాయర్ ప్రారంభోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించుకుందామని చెప్పారు. ఈ రిజర్వాయర్ను ఒకసారి నింపితే రెండేండ్ల వరకు రెండు పంటలను పుష్కలంగా పండించుకోవచ్చని, హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం కావడం ఖాయమని అన్నారు. అనంతరం గిరిజన నిర్వాసితులు, కల్యాణలక్ష్మి లబ్ధ్దిదారులు, చేతి వృత్తుల వారికి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయిందని అన్నారు. గేట్లు బిగించడంతోపాటు తుదిదశ పనులు పూర్తవుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట, హనుమకొండ జడ్పీ చైర్పర్సన్లు రోజాశర్మ, సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.