Minister Harish Rao | అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోవడం దురదృష్టకరమని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. పంటలను పరిశీలించి, ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం దుబ్బాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వానతో నోటి కాడికి వచ్చిన ముద్ద నేల పాలైనట్లు చేతికాడికి అందిన పంటలను రైతులు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
ఆరుగాలం కష్టపడి రాత్రనక పగలనక రైతులు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకుండాపోయిందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వడగండ్ల వానతో జిల్లాలో పంటలకు తీవ్రనష్టం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ, రైతు కష్టాలు తెలిసిన నేతగా పంట నష్టాన్ని పరిశీలించి రైతులను ఆదుకునేందుకు నన్ను ప్రతినిధిగా పంపారన్నారు. జిల్లాలో సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని 25గ్రామాల్లో తిరిగి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకి రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని, రైతులు ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా కల్పించినట్లు చెప్పారు. పంట నష్టపోయిన ఎకరాకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేలు ఇస్తుందన్నారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే మరో రూ.10వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా పథకాలను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని, యాసంగి కాలంలో తెలంగాణలో సాగయ్యే బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం తీసుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
రూ.30వేల కోట్లు ఇవ్వకుండా ఆపిన రైతుల మోటార్లకు కరెంటు మీటర్లు పెట్టలేదన్నారు. రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో యాసంగిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని తెలిపారు. ఇవన్నీ రైతులపై సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. నగదు బదిలీ పథకానికి ప్రత్యక్ష నిదర్శనం తెలంగాణ పథకాలని, అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో నగదు బదిలీ పథకాలు కొనసాగుతున్నాయన్నారు.
అన్నదాతల ఆదాయం పెంచే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని, దేశంలో అతి ఎక్కువ ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు తెలంగాణకు రావడం ఇక్కడి పరిపాలనకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా వ్యవసాయంగానికి గట్టి పునాదులు వేశారని, – ఏ గ్రామంలో తిరిగిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం పట్ల రైతులలో ప్రేమ అభిమానం కనబడుతున్నదన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖ అధికారులు ఉన్నారు.