సిద్దిపేట: భావితరాలకు అష్టకాల నరసింహ రామ శర్మ జీవిత చరిత్ర మార్గదర్శకం కావాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతి అవధానానికి, ఆధ్యాత్మిక సాహిత్య రంగాలకు తీరని లోటని చెప్పారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన అష్టావధాని, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక సాహిత్యవేత్త అనంతసాగర్ శ్రీ సరస్వతి ఆలయ వ్యవస్థాపకులు శ్రీ అష్టకాల నరసింహ రామ శర్మ గారి కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అష్ఠకాల వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా వారి శిష్య బృందంతో అష్టావధానం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతసాగర్ ఆలయ ప్రాంతంలో నిలవెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంత గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో ఉండటం మన అదృష్టమని,సిద్దిపేటలో ఏదైనా భవనానికి ఆయన పేరు పెడతామన్నారు. సీఎం కేసీఆర్కు, తనకు అత్యంత ఆత్మీయుడని చెప్పారు.
వైదికాన్ని అవపోసన పట్టి వేలాది మంది శిష్యులను వైదికంగా తయారు చేశారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వందలాది అష్టావధానాలు చేసి అవధానిగా మన ప్రాంతానికి వన్నె తెచ్చిన గురువన్నారు. అవధానాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనంతసాగర్ ప్రాంతంలో గొప్ప సరస్వతి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి సామాజిక సేవగా సమాజానికి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. అవధాన శిరోమణిగా పెరుగాంచిన శర్మగారి అవదానం ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 500 పైగా సరస్వతి యజ్ఞ యగాలు నిర్వహించి అమ్మవారి మహత్యాన్ని సమాజానికి చాటి చెప్పారని తెలిపారు. ఎన్నో ఆలయాలు ఆయన చేతులమీదుగా ప్రతిష్ఠలు జరిగాయని తెలపిఆరు. ధర్మ సందేహాలకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి నివృత్తి చేసేవారని, వారి సేవలు చిరస్మరణీయమని చెప్పారు. వారి జీవితం భావి తరాలకు మార్గదర్శనం కావాలన్నారు. సామజిక , ఆధ్యాత్మిక సేవకు మారు పేరుగా నిలిచిన వారి సేవలను కొనసాగిస్తామని వెల్లడించారు.