సిద్దిపేట: తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ (Professer Jayashankar) సార్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సార్ సేవలు చిరస్మరణీయమని చెప్పారు. నాటి వారి ఆలోచనలే నేటి తెలంగాణ (Telangana) రాష్ట్రం అని, ఆచార్యుని ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఆయన మన మధ్య లేనప్పటికీ.. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు. ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం చేరేందుకే తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని జయశంకర్ సార్ ఎప్పుడూ అనేవారని చెప్పారు.
నేడు కాళేశ్వరం జలాలతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేసుకున్నామని, నిధుల్లో దేశంలోనే ధనిక రాష్ట్రంగా, దేశాన్ని సాదుతున్న మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థకు రాష్ట్రం ఊతమిస్తున్నదని చెప్పారు. నియమాకాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 80 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ఆచార్యుని కలలు కన్న నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని వెల్లడించారు. ఇప్పుడు ఆయన ఉంటే ఎంతో సంతోష పడేవారనన్నారని చెప్పారు.
జయశంకర్ సార్ టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు చేదోడువాదోడుగా ఉండేవారని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సూచనలు, సలహాలు అందించారన్నారని వెల్లడించారు. 2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి వచ్చిన ప్రకటనను స్వయంగా రాసి కేంద్ర హోంశాఖకు పంపించారని తెలిపారు. ప్రధాన మంత్రులకు, రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలన్నా, శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ ఎందుకు ఇవ్వాలో చెప్పాలన్నా ప్రతి అంశంలో జయశంకర్ సార్ ఉన్నారన్నారు. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని, ఆయన పేరుతో భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ జిల్లాగా పేరు మార్చు కున్నామని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ వర్సిటీగా నామకరణం చేశామన్నారు.