NIMS | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పేద ప్రజల దవాఖాన నిమ్స్కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా త్వరలోనే నిమ్స్ విస్తరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. గురువారం నాంపల్లిలోని ఏరియా దవాఖానను సందర్శించి డయాలసిస్ కేంద్రం, బ్లడ్బ్యాంక్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2 వేల పడకల సామర్ధ్యంతో కొత్తగా మూడు బ్లాకులు నిర్మించనున్నట్టు చెప్పారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్లు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. గచ్చిబౌలి, సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో నిర్మించనున్న టిమ్స్తోపాటు వరంగల్ హెల్త్సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నాలుగు టిమ్స్ దవాఖానలు, నిమ్స్ విస్తరణ చేపట్టారని.. దీంతో మరో ఆరువేల పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ట్రామా కేర్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు.
నిమ్స్ విస్తరణకు అదనంగా 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ను నిర్మించనున్నారు. ఈ పనులకు ఇటీవలే మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నిమ్స్లో గైనకాలజీ విభాగం సేవలు అందుబాటులో లేవు. ప్రసవాలు కూడా జరగడం లేదు. ఎంసీహెచ్ నిర్మాణంతో ఈ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంసీహెచ్ నిర్మాణానికి రూ.55 కోట్లు వెచ్చించనున్నారు. నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తారు. భవిష్యత్తులో 8 అంతస్తులకు పెంచుకొని ప్రత్యేక బ్లాక్గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం పడకలు : 1489
అదనపు పడకలు : 2000
మొత్తం : 3,489
కేటాయించిన విస్తీర్ణం : 33 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం రూ.1571 కోట్లు
ఆక్సిజన్ బెడ్లు : 1200
పేయింగ్ రూమ్స్ : 300
ఐసీయూ బెడ్లు : 500
మొత్తం : 2000