కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 5: రాష్ట్రంలో ఎరుకల జాతి మేలు కోసం రూ.60 కోట్లతో ఎంపవర్మెంట్ స్కీమ్ను ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఎరుకల జాతి ఆరాధ్యదైవం నాంచారమ్మ జాతరను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నిజాంపేటలో ఎకరం విస్తీర్ణంలో రూ.5 కోట్లతో ఎరుకల ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించినట్టు చెప్పారు. ఎరుకల జాతి కోసం నగరంలో స్థలాలను కేటాయించేందుకు కృషిచేస్తామని హరీశ్ హామీనిచ్చారు. గత ప్రభుత్వాలు ఎరుకలను చిన్నచూపు చూశాయని, రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎరుకల కులస్థుల నుంచి ఎమ్మెల్సీగా కుర్రా సత్యనారాయణకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని గుర్తుచేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తే బీజేపీ అనుకూల గవర్నర్ ఆపారని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల కోటాలోనే సత్యనారాయణకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని అప్పుడు వాళ్లేమీ చేయలేరని స్పష్టంచేశారు.
తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కూకట్పల్లిలో నిర్వహించిన ఎరుకల ఆత్మగౌరవ సభలో హరీశ్రావు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఎంపవర్మెంట్ స్కీమ్ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో అమలుచేస్తామని చెప్పారు. హైదరాబాద్లో కూడా అమలుకు తన వంతు కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ప్రఖ్యాత బోయినపల్లి మార్కెట్కు తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు అధ్యక్షుడు కాగలిగారని చెప్పారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఎరుకల, లంబాడి, కోయ, గోండు జాతుల పిల్లలు విద్య ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు పొందుతారని, తద్వారా డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని వివరించారు. విదేశాల్లో చదువుకునేందుకు అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్షిప్ ద్వారా రూ.20 లక్షలు అందిస్తున్నట్టు మంత్రి హరీశ్ చెప్పారు.
తెలంగాణ వ్యతిరేకులైన కిరణ్కుమార్రెడ్డి, పవన్కల్యాణ్లతో బీజేపీ మిలాకత్ అయిందని, వైఎస్ షర్మిల లాంటి తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసిపోయారని హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణపై ద్రోహులం తా ఒక్కటై కుట్రలు చేస్తున్నారని, దీనిని ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు లేదని, కర్ఫ్యూ లేదని, ప్రజలం తా ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పా రు. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ నగరం న్యూయార్క్ తరహాలో అభివృద్ధి చెందిందని మాట్లాడుతుందే కాంగ్రెస్ పార్టీలోని గజనీకాంత్లకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ హైదరాబాద్ సింగపూర్లా అభివృద్ధి చెందిందని మెచ్చుకుంటే ఇక్క డి బీజేపీ నేతలకు మాత్రం అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. తలలో నాలుకలా ఉండే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును మరోసారి గెలిపించాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు కు ర్రా సత్యనారాయణ, కుతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, కోశాధికారి రవికుమార్, గ్రేటర్ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎల్లేశ్, శ్రీరామాఆనంద్, నాగులు, పోచయ్య పాల్గొన్నారు.