హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయన్నారు. ఇది గొప్ప విజయం. 1200 సీట్లు ఒక విద్యాసంవత్సరంలో రావడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ఇవాళ మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో గాంధీ ఆస్పత్రికి వెళ్లి 2004 నుంచి 2014 వరకు మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడానని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ వస్తేనే మెడికల్ కాలేజీలు వస్తాయని, న్యాయం జరుగుతుందని మాట్లాడటం జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో మూడే మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్. 70ఏళ్ల సమైక్య పాలనలో మూడు కాలేజీలు వస్తే, ఏడేళ్లలో 17 కాలేజీలు తెచ్చుకున్నాం. కొత్తగా 12 కాలేజీలను ఈ ఏడేళ్లలో తెచ్చుకోగలిగామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో 8 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటున్నామని చెప్పారు. ఒక్క మెడికల్ కాలేజీకి రూ. 510 కోట్ల చొప్పున సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. మొత్తం రూ. 4,080 కోట్లు మంజూరు చేయడం జరిగిందని హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చేందుకు కృషి చేసిన డీఎంఈకి, ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్కు, విమలా థామస్, డాక్టర్ వాణికి మంత్రి అభినందనలు తెలిపారు. రిజ్వీ కృషిని కూడా అభినందిస్తున్నానని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడినపుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే, ఈ విద్యా సంవత్సరంలో 2,901కు సీట్లను పెంచుకున్నామని హరీశ్రావు వెల్లడించారు. ఎంబీబీఎస్ సీట్లు 3.3 రెట్లు పెరిగాయన్నారు. ఇది చారిత్రాత్మక విజయం అని మంత్రి పేర్కొన్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్, చైనా, ఫిలిఫ్పీన్ వంటి దేశాలకు వెళ్లి వైద్య విద్య అభ్యసించవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితికి కారణం. సమైక్య పాలనలో తెలంగాణపై చూపిన వివక్షే అని హరీశ్రావు ధ్వజమెత్తారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ- ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 6,540 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014లో ప్రభుత్వ- ప్రయివేటు రంగంలో ఎంబీబీఎస్ సీట్లు కేవలం 2,600 ఉన్నాయని గుర్తు చేశారు. ఇవి కాక ఆయుష్, ఆయుర్వేద, యూనాని వంటి విభాగాల్లోనూ సీట్లు ఉన్నాయని తెలిపారు.
బీ కేటగిరి సీట్లలోనూ 85 శాతం లోకల్ రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. దీని వల్ల తెలంగాణ వైద్య విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయ వల్ల 1,067 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయని పేర్కొన్నారు.