యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ‘బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తోంటే.. కాంగ్రెసోళ్లు పేల్చేస్తామంటరు. బీజేపోళ్లు కూల్చేస్తామంటరు. పేల్చటోని చేతికో.. కూల్చెటోనీ చేతికో పోతే తెలంగాణ ఆగమైతది. బిడ్డా.. మీరిట్లనే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీ డిపాజిట్లు గల్లంత చేస్తరు’ అని కాంగ్రెస్, బీజేపీ నేతలను మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఏం చెప్పాలో దికుతోచక, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం లేక, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే.. ఒకరు కుట్ర అని, అంబేద్కర్ పేరు మీద సచివాలయం నిర్మిస్తే ఇంకొకరు కూలుస్తమని అడ్డగోలుగా వాగుతున్నారని మండిపడ్డారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో నిర్మించనున్న 100 పడకల దవాఖానకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు కావాల్సింది పేల్చేటోళ్లు, కూల్చేటోళ్లు కాదని, నిర్మించేటోళ్లు, పునాదులు తవ్వేటోళ్లు కావాలని హరీశ్రావు స్పష్టం చేశారు. యాదాద్రి దేవాలయం వంటిది కావాలని, పాఠశాలల అభివృద్ధి జరుగాలని, ఆసుపత్రుల నిర్మాణం జరుగాలని, మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేయాలని, ప్రాజెక్టులు కట్టాలని ప్రజలు కోరుకుంటారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏం చేసినా చేసినా ప్రజల కోసమేనని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో 33 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
బీబీసీపై ఐటీ రైడ్ చేయడం దారుణమని, ఇది చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీబీసీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ అని, ఆ సంస్థపై దాడి చేసి దేశం పరువు తీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీలో ఒక వార్త వచ్చిందని తెల్లారి ఐటీ దాడులు చేయించారని, ప్రపంచం ముందు దేశం పరువు పోతున్నదని వాపోయారు. నాయకులకు ఓపిక, సమాధానం చెప్పే శక్తియుక్తులు ఉండాలని, ఇలా దాడులు సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఐటీ, ఈడీలను తోలుతా అంటే దేశం పరువు పోదా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే, బండి సంజయ్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. ‘ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే, మాకు కార్యకర్తలు ఎట్లా అంటడు. మీది కుట్ర కాదా?’ అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇస్తే సంతోషపడాల్సింది పోయి బాధపడుతున్నడని పేర్కొన్నారు. కడుపులో ఉన్నదాన్ని బయటకు కక్కిండని బండిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇచ్చే తెలంగాణ ప్రభుత్వానిది కుట్ర అవుతుందా..? ఉద్యోగాలు ఇస్తే ఏడ్చే బండి సంజయ్ది కుట్ర అవుతుందా..? అని నిలదీశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే బీజేపీ కుట్ర అని విమర్శించారు. కొత్త ఉద్యోగాల కోసం బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించడాన్ని గుర్తు చేశారు.
యాదగిరిగుట్టను అద్భుతంగా పునర్నిర్మించామని, యాదాద్రి ఆలయం కట్టినా ఓట్లప్పుడు ఎక్కడా చెప్పుకోలేదని, ఎన్నికల ముందు ప్రారంభించ లేదని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికలు అయ్యేదాకా గుళ్లు కట్టి, ఎన్నికల ముందు ప్రారంభించే సంసృతి బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. బీజేపీ లెక్క మతాన్ని రాజకీయం కోసం వాడుకునే సంసృతి తమది కాదని స్పష్టం చేశారు.
వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ శాఖకు ఇవ్వాలని, ఎంత ఖర్చయినా విద్యుత్ కొని రైతులకు ఫుల్ కరంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. రోజుకు 40-50 కోట్లు ఖర్చు చేసి కరంట్ కొంటున్నామని, యూనిట్కు 25 నుంచి 30 రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఒక రూపాయి కూడా తీసుకోకుండా బోరు కాడ, బాయి కాడ రైతులకు ఉచిత కరంట్ ఇస్తున్నామని చెప్పారు. ఎండకాలం ఒక గంట కూడా ఎండొద్దనేది సీఎం ఆలోచన అని తెలిపారు. అందుకోసం రాత్రీపగలు కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ దేశంలో బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో గానీ, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో గానీ తెలంగాణ లెక కరెంట్ ఇస్తలేరని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద రూ.65 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.5,400 కోట్లు, ఉచిత విద్యుత్ కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు.