ఏటా 3,300 స్టాఫ్ నర్సులకు శిక్షణ
5,240కి పెరగనున్న మెడికల్ సీట్లు
హైదరాబాద్ వైద్యం కోసం ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు..
మలక్పేట యశోదలో నూతన ఓపీని ప్రారంభించిన హరీశ్రావు
మలక్పేట, జూన్ 13: రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్ వ్యాక్సిన్హబ్గా, మెడికల్ హబ్గా మారడం గర్వకారణమని చెప్పారు. హైదరాబాద్లో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతున్నదని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా చికిత్స చేయించుకొనే ఎదిగిందని తెలిపారు. ఇతర రాష్ర్టాలతో పాటు ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి పేషెంట్లు వస్తుండటం వైద్యరంగంలో సాధించిన ఘనతగా పేర్కొన్నారు. సోమవారం ఆయన మలక్పేటలోని యశోద దవాఖానలో నూతనంగా నిర్మించిన ఔట్ పేషెంట్ విభాగాన్ని, ప్రపంచస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ పెట్-సీటీ స్కాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ పెట్-సీటీ స్కాన్తో క్యాన్సర్ను ముందుగా గుర్తించడం సాధ్యమవుతుందని చెప్పారు. పాత తరం పెట్సీటీల కంటే నాలుగు రెట్లు వేగంగా స్కాన్ చేస్తుందని వివరించారు. హైదరాబాద్లో ఒక్క యశోద దవాఖానలోనే నాలుగు వేల పడకలు ఉన్నాయని, యశోద వైద్యులు అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవల కారణంగానే ఇది సాధ్యమైందని చెప్పారు. నిమ్స్లో పడకల సంఖ్యను 1,400 నుంచి 2 వేలకు పెంచుతామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థ నాయకత్వం, శాంతిభద్రతలు, విప్లవాత్మక విధానాల కారణంగా హైదరాబాద్కు పెట్టుబడులు తరలివస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు నర్సింగ్ సేవలకు కేరళ కేరాఫ్ అడ్రస్గా ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో ఏటా 3,300 మంది శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులు వస్తారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,840 మెడికల్ సీట్లు ఉన్నాయని, వచ్చే ఏడాది వీటి సంఖ్య 5,240కి చేరుతుందని వివరించారు. పీజీ సీట్లను కూడా 500 నుంచి వెయ్యికి పెంచినట్టు తెలిపారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో వేయి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన, వరంగల్లో 2వేల పడకల దవాఖాన నిర్మించనున్నట్టు తెలిపారు. రేడియో, కీమో థెరపీని జిల్లా దవాఖనాల్లో కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రభుత్వ దవాఖానల్లో కేవలం 200 ఐసీయూ బెడ్స్ మాత్రమే ఉండేవని ఇప్పుడు వాటి సంఖ్యను ఆరువేలకు పెంచుతున్నామని వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదికి 3 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. ఉస్మానియా, గాంధీ దవాఖానలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సేవ లు కూడా అందించబోతున్నామని తెలిపారు. అనంతరం యశోద దవాఖానల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్రావు మాట్లాడుతూ.. తమ దవాఖానాల్లో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్స కోసం సమగ్ర న్యూ క్సియర్ మెడిసిన్ అందుబాటులో ఉన్నదని చెప్పా రు. పెట్-సీటీ గామా కెమెరా ఇమేజింగ్, రేడియో న్యూైక్లెడ్ థెరపి సేవలను ఒకే తాటిపైకి తెచ్చి అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, యశోద డైరెక్టర్ పవన్, ఆంకాలజీ హెడ్ వంశీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.